Telugudesam: టీడీపీ గూండాలతో నిండిపోయింది!: విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు

  • అమిత్ షా కాన్వాయ్ పై దాడిని ఖండిస్తున్నాం
  • రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ నేతలు దాడికి పాల్పడుతున్నారు
  • దేశం మొత్తం ఏపీని ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడింది

తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడిని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడి జరగడం దారుణమని, తిరుపతికి వచ్చే వారిని అతిథులుగా గౌరవించాలని, రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ నేతలు దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఇన్నాళ్లూ టీడీపీ అవినీతిలో మాత్రమే కూరుకుపోయిందనుకున్నాం కానీ, ఆ పార్టీ గూండాలతో నిండిపోయిందని ఇప్పుడు తెలిసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమని, దేశం మొత్తం ఏపీని ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
 
వ్యక్తిగత దాడులతో టీడీపీ ఏం చెప్పాలనుకుంటోంది?

ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ, అమిత్ షా కాన్వాయ్ పై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. వ్యక్తిగత దాడులతో టీడీపీ ఏం చెప్పాలనుకుంటోందన్న విషయంపై సీనియర్ నేతనని చెప్పుకుంటున్న చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ వైఖరి ఏపీ ప్రజలు తలదించుకునేలా చేసిందని, ఈ దాడిని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు.

More Telugu News