Chandrababu: జనాభా నియంత్రణ మా విధానం కాదు.. యువత పెళ్లిని వాయిదా వేసుకుంటోంది: చంద్రబాబు

  • జనాభా నియంత్రణతో మన పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గింపు
  • యువత జీవితంలో స్థిరపడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు
  • పెళ్లి చేసుకున్న వారు ఒక్క బిడ్డను మాత్రమే కంటున్నారు
  • వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో చంద్రబాబు

పేదరిక నిర్మూలనే తమ ధ్యేయమని, అందుకోసం రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను వ్యతిరేకించే విషయంలో ఒకే అభిప్రాయం కలిగిన పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల తొలి సమావేశం ఏప్రిల్ 10న కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. రెండవ సమావేశానికి ఏపీ రాజధాని అమరావతి ఆతిథ్యమిచ్చింది.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జనాభా నియంత్రణలో కేరళ అందరికన్నా ముందుందని, ఆ తరువాత తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, పెద్ద ఎత్తున ప్రచారం చేశామని, ఏడెనిమిది ఏళ్లలో జనాభా పెరుగుదల రేటును తగ్గించగలిగామని చెప్పారు.

అయితే, జనాభా నియంత్రణ పాటించడం వల్ల నియోజక వర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతంలో పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గిపోతుందన్నారు. ప్రస్తుతం జనాభా నియంత్రణ తమ విధానం కాదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం నిధులను కేటాయిస్తే పురోగమనంలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. అక్షరాస్యత పెంపొందించడం ద్వారా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. నేటి యువత ఉద్యోగానికి, జీవితంలో స్థిరపడటానికి ప్రాధాన్యత ఇస్తూ పెళ్లిని వాయిదా వేస్తోందని అన్నారు.

పెళ్లి చేసుకున్న వారు ఒక్క బిడ్డను మాత్రమే కని సరిపుచ్చుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. దాంతో జనాభా గణనీయంగా తగ్గుతోందన్నారు. దక్షిణ కొరియాలో పెళ్లి కాని యువత 35 శాతం వరకు ఉన్నట్లు తెలిపారు. సమాఖ్య విధానానికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను దండించడం సరికాదన్నారు. భారత ప్రభుత్వం సహకార సమాఖ్య వ్యవస్థను గౌరవించాలన్నారు.

గతంలో టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆందోళన మేరకు సర్కారియా కమిషన్ ఏర్పడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ కమిషన్ కేంద్ర, రాష్ట్ర సంబంధాలను స్పష్టంగా తెలియజేసిందన్నారు. రాష్ట్రం విడిపోవడంతో అత్యధిక ఆదాయం కలిగిన హైదరాబాద్ ను కోల్పోయినట్లు తెలిపారు. విభజన సమయంలో పార్లమెంటులో అప్పటి ప్రధాన మంత్రి ప్రకటించిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వని అంశాన్ని ప్రస్తావించారు.

సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళుతున్నామని చంద్రబాబు చెప్పారు. విభజన వల్ల తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నామన్నారు. రాష్ట్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రెండంకెల వృద్ధి రేటుని సాధిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా, గ్యాస్ సరఫరాలో వంద శాతం ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో వనరులు బాగా ఉన్నాయని, టెక్నాలజీ సాయంతో భవిష్యత్ లో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర సర్కారు తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించినట్టుగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. పురోగతిలో ఉన్న రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్ట పోవడానికి వీల్లేదని, ఈ అన్యాయాన్ని సహించేది లేదని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని, 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర నిధుల కేటాయింపు జరపడం సరికాదన్నారు. కష్టపడుతోన్న వారినే శిక్షించేలా కేంద్రం వ్యవహరిస్తోందని, తమ రాష్ట్రం విషయంలో అదే జరుగుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులూ ఇవ్వదు, రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని అన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలని అన్నారు.     

More Telugu News