UPSE: సివిల్స్ లో అంతే... టాపర్ అనుదీప్ కు వచ్చిన మార్కుల వివరాలు!

  • 55.60 శాతం మార్కులతోనే తొలి స్థానానికి
  • రాత పరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులు
  • రెండో స్థానంలో నిలిచిన అనూ కుమారికి ఇంటర్వ్యూలో 187 మార్కులు

ఇటీవల యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సివిల్ సర్వీసెస్ - 2017 ఫలితాలు వెల్లడికాగా, తెలుగుతేజం దురిశెట్టి అనుదీప్ తొలి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా, అతనికి వచ్చిన మార్కుల వివరాలను యూపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన అనుదీప్ కు వచ్చిన మార్కుల శాతం ఎంతో తెలుసా? 55.60 శాతం. అంటే సాధారణ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు కూడా కాదన్నమాట. ఇక ఈ 28 ఏళ్ల టాపర్ కు రాత పరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులు వచ్చాయని, మొత్తం మీద 1,126 మార్కులు సాధించారని యూపీఎస్సీ ప్రకటించింది.

మొత్తం 2,025 మార్కులకు (మెయిన్ పేపర్ 1,750 మార్కులకు, ఇంటర్వ్యూను 275 మార్కులుకు) పోటీ పడిన అనుదీప్ కు వచ్చింది 1,126 మార్కులేనంటే, పరీక్షా విధానం, జవాబుపత్రాల వాల్యూషన్ ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే పరీక్షల్లో రెండో స్థానంలో నిలిచిన అనూ కుమారికి 1,124 మార్కులు వచ్చాయి. ఆమె రాత పరీక్షలో 937, ఇంటర్వ్యూలో 187 మార్కులను సాధించి 55.50 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. మూడో స్థానంలో నిలిచిన సచిన్ గుప్తాకు రాత పరీక్షలో 946, ఇంటర్వ్యూలో 176 మార్కులు రాగా 55.40 శాతంతో ఉత్తీర్ణుడయ్యారు.

More Telugu News