BJP: ఎన్టీఆరే ఉదాహరణ.. కేసీఆర్‌కూ అదే గతి పడుతుంది: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్

  • జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్ సొంత రాష్ట్రంలో బోల్తా పడ్డారు
  • వచ్చే ఎన్నికల్లో ఇదే సీన్ రిపీటవుతుంది
  • తెలంగాణలో ఒంటరి పోరే

నాడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్ సొంత రాష్ట్రంలో ఓటమి పాలయ్యారని, ఇప్పుడు కేసీఆర్‌కూ అదే గతి పడుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం పక్కా అని, అందుకు ఎన్టీఆరే నిదర్శనమని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో కూటముల కోసం ప్రయత్నించారని గుర్తు చేశారు. ఆ విషయంలో ఆయన కొంత విజయం సాధించినా,  సొంతం రాష్ట్రంలో మాత్రం దారుణంగా ఓడిపోయారని లక్ష్మణ్ వివరించారు.

2019 ఎన్నికల్లో మళ్లీ ఇలాగే జరగడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ను తోక పార్టీ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాంగ్రెస్‌తో సంబంధాలున్న నేతలను ఎందుకు కలుస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుమతితోనే ఆయన అంతమందిని కలవగలుగుతున్నారని, ఆయన పర్యటనలు మొత్తం కాంగ్రెస్‌కు లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్న లక్ష్మణ్ జూన్ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.

More Telugu News