Siddaramaiah: బాదామి నుంచి కూడా పోటీకి దిగుతున్న సిద్ధరామయ్య!

  • బాదామి నుంచి ప్రాతినిధ్యం వహించాలంటూ ప్రజల ఒత్తిడి
  • అంగీకరించిన సీఎం.. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్
  • ఇప్పటికే చాముండేశ్వరి నుంచి నామినేషన్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన తాజాగా బాదామి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు.

‘‘బాదామి నుంచి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఒత్తిడితో సిద్ధరామయ్య ఇందుకు అంగీకరించారు. అధిష్ఠానం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఆయన చాముండేశ్వరితోపాటు బాదామి నుంచి కూడా పోటీ చేస్తారు’’ అని ఖర్గే తెలిపారు.

మోదీ కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఎన్నికల్లో మోదీ వారణాసి, వడోదర స్థానాల నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. 225 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో వచ్చే నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. 15న ఫలితాలు వెల్లడిస్తారు.

More Telugu News