varla ramaiah: బాలయ్య తప్పేం మాట్లాడలేదు.. ఢిల్లీ పెద్దలు అర్థం చేసుకోవడం లేదు: వర్ల రామయ్య

  • బాలయ్య మాట్లాడిన దానిలో అసత్యాలు లేవు
  • బాలయ్యపై కాదు.. దమ్ముంటే 5 కోట్ల ఆంధ్రులపై కేసులు పెట్టండి
  • చంద్రబాబు దీక్షకు ప్రత్యక్షంగా 80వేల మంది మద్దతు పలికారు

విజయవాడలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పేమీ మాట్లాడలేదని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య అన్నారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను ఢిల్లీ పెద్దలు అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజలు పడుతున్న ఆవేదనను చూసి, బాలయ్య కొంచెం గట్టిగా మాట్లాడారని, ఆయన మాట్లాడిన దాంట్లో అసత్యాలు లేవని చెప్పారు.

బాలయ్యపై బీజేపీ నేతలు కేసులు పెడుతున్నారని... వారికి దమ్ముంటే 5 కోట్ల ఆంధ్రులపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చేపట్టిన దీక్షకు ప్రత్యక్షంగా 80 వేల మంది ప్రజలు వచ్చి మద్దతు ప్రకటించారని... కేంద్రం తీరుపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News