manchu vishnu: మమ్మల్ని కూడా కలిపి చెప్పారా?: 'మా'పై మంచు విష్ణు తీవ్ర వ్యాఖ్యలు

  • ఆమెతో ఎవరూ నటించకూడదని నిషేధం విధించారు
  • పరిశ్రమలోని పెద్ద కుటుంబంపై ఆమె విమర్శించగానే... నిషేధం ఎత్తి వేశారు
  • మీ అనాలోచిన నిర్ణయాలతో 'మా' పరువు పోతోంది

నటి శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవహరించిన తీరు పట్ల హీరో మంచు విష్ణు అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 'మా' తీరును విమర్శిస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. అసోసియేషన్ లో సభ్యత్వం లేని ఓ వ్యక్తి విషయంలో 'మా' వ్యవహరించిన తీరు గందరగోళంగా ఉందని లేఖలో పేర్కొన్నాడు. అసోషియేషన్ లో సభ్యత్వం ఉన్న 900 మందిలో ఏ ఒక్కరూ కూడా ఆమెతో కలసి నటించకూడదంటూ నిషేధం విధించారని... ఆ 900 మందిలో తాను, తన తండ్రి, తన సోదరుడు, తన సోదరి కూడా ఉన్నామని... మమ్మల్ని కూడా కలిపే ఆ నిషేధం విధించారా? అని ప్రశ్నించాడు.

ఆ తర్వాత ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాలపై ఆమె విమర్శలు చేయగానే... హడావుడిగా నిషేధం ఎత్తి వేశారని ఎద్దేవా చేశాడు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల 'మా' పరువు పోతోందని అన్నాడు. ప్రజలు, మీడియా దృష్టిలో చులకన అవుతోందని చెప్పాడు. ఓ నటుడిగా, ఓ నిర్మాతగా ఎవరితో కలసి నటించాలి, ఎవరిని సినిమాలో పెట్టుకోవాలి? అనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉంటుందని... ఆ విషయంలో జోక్యం చేసుకోవడానకి ఎవరికీ అధికారం లేదని విష్ణు చెప్పాడు.

ఆ విషయంలో 'మా' ఆదేశాలు జారీ చేయడం మంచిది కాదని తెలిపాడు. మీ చర్యలతో 'మా'కు చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నాడు. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సినీ పరిశ్రమకు చెడ్డపేరు తీసుకొస్తున్నాయని... ఈ విషయంలో గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు చేసే బాధ్యతను ఫిల్మ్ ఛాంబర్ కు అప్పగించాలని సూచించాడు.  

More Telugu News