gannavaram: ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న వైసీపీ ఎంపీలు.. 2019లో రాజకీయ సమీకరణాలు మారతాయని వ్యాఖ్య!

  • హోదాపై ఢిల్లీలో శాయశక్తులా పోరాడామన్న ఎంపీలు
  • ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చే వారికే మద్దతిస్తామని వ్యాఖ్య
  • కాసేపట్లో జగన్‌తో భేటీ

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో తాము శాయశక్తులా పోరాడామని వైసీపీ ఎంపీలు అన్నారు. ఈ రోజు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ... తాము కాసేపట్లో వైఎస్‌ జగన్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు. జగన్ నేతృత్వంలో తాము ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరతామని చెప్పుకొచ్చారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని, ఇందులో చంద్రబాబు నాయుడి భాగస్వామ్యం ఉందని అన్నారు. 2019లో రాజకీయ సమీకరణాలు మారతాయని, ఏపీకి ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తారో వారికే మద్దతిస్తామని అన్నారు. కాగా, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కార్లలో వైసీపీ ఎంపీలు శోభనాపురం బయలుదేరారు. ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తోన్న జగన్‌ను వారు కాసేపట్లో కలవనున్నారు. కాగా, ప్రత్యేక హోదాపై జగన్‌ తమ పార్టీ నేతలందరితో చర్చించి, తమ తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.    

More Telugu News