Gujarat: మరో దారుణం: 9 ఏళ్ల బాలికను రేప్ చేసి, చిత్రహింసలు పెట్టి చంపేసిన ‘మృగాళ్లు’!

  • బాలికపై 8 రోజులపాటు అత్యాచారం.. ఆపై చిత్రహింసలు
  • మృతదేహంపై 86 గాయాలు
  • బాలిక వివరాలు చెప్పే వారికి రివార్డు ప్రకటించిన పోలీసులు

ఓపక్క ఉన్నావో, కథువా దారుణాలు దేశాన్ని ఊపేస్తుంటే మరోవైపు అంతకుమించిన దారుణం ఒకటి గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగుచూసింది. తొమ్మిదేళ్ల బాలికపై కామాంధులు 8 రోజులపాటు అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు.
ఈనెల 6న పోలీసులు బెస్తాన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానం సమీపంలో శరీరం నిండా గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఐదు గంటలపాటు నిర్వహించిన పోస్టు మార్టంలో బాలికను గొంతు నులిమి చంపేసినట్టు తేల్చారు. చిన్నారిని ఎనిమిది రోజులపాటు చిత్రహింసలకు గురి చేసి రేప్ చేసినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై ఏకంగా 86 గాయాలు ఉండడాన్ని చూస్తుంటే దుర్మార్గులు ఆమెను ఎంతగా హింసించారో అర్థం అవుతోంది. బాలికను గుర్తించాల్సి ఉందని, పాప కోసం ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. అలాగే చిన్నారిపై ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక రహస్య భాగాలు సహా మొత్తం 86 చోట్ల గాయాలున్నాయని సివిల్ ఆసుపత్రి ఫోరెన్సిక్ హెడ్ గణేశ్ గోవేకర్ తెలిపారు. రేప్‌కు ముందు ఆమెకు డ్రగ్స్ ఇచ్చినదీ, లేనిదీ ఫోరెన్సిక్ నివేదికలో తెలుస్తుందన్నారు. ఎనిమిది రోజులైనా బాలిక కోసం ఎవరూ రాలేదని పేర్కొన్న పోలీసులు.. చిన్నారిని ఎక్కడో చంపేసి ఇక్కడకు తెచ్చి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఫొటోను పోలీస్ కంట్రోల్ రూముకు పంపామని, గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బాలిక గురించి కానీ, ఆమె కుటుంబ సభ్యుల గురించి కానీ వివరాలు చేప్పే వారికి రూ.20 వేల బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు ప్రకటించారు.

More Telugu News