Rahul Gandhi: రాహుల్ గాంధీ అభిమానులపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం!

  • అత్యాచార బాధితుల కోసం అర్థరాత్రి రాహుల్ నడక
  • నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
  • ఎందుకొచ్చామో తెలుసుకుని ప్రవర్తించండి
  • కార్యకర్తలపై మండిపడ్డ ప్రియాంకా గాంధీ

ఉన్నావో, ఖతువా అత్యాచార బాధితులకు అండగా నిలుస్తామన్న అభయాన్ని ఇస్తూ, గత అర్ధరాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నడిరోడ్లపై నిరసనలు తెలుపుతూ నడిచిన వేళ, అభిమానులు చేస్తున్న హంగామాపై ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ఈ నిరసన ఎందుకు తెలియజేస్తున్నామో తెలుసుకోకుండా నినాదాలు ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ అల్లరి చేసేవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని గద్దించారు.

 ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండి, మాట్లాడకుండా నడవాలని సూచించారు. ఏ కారణంతో ఇక్కడికి వచ్చామో అర్థం చేసుకుని బాధ్యతగల పౌరుల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని అన్నారు. కాగా, తన భర్త రాబర్ట్ వాద్రాతో కలసి వచ్చిన ఆమె, ఇండియా గేట్ వద్ద రాహుల్ నిరసనలో జత కలిశారు. ఈ దేశం తమకు భద్రత నిస్తుందని ప్రతి మహిళా నమ్మేలా పరిస్థితులు మారాల్సి వుందని ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ అభిప్రాయపడ్డారు.

More Telugu News