Andhra Pradesh: చంద్రబాబు మరీ హీనంగా వ్యవహరిస్తున్నారు: బీజేపీ ఎంపీ జీవీఎల్ నిప్పులు

  • లెనిన్ సెంటర్ లో ఉపవాస దీక్షకు అనుమతివ్వలేదు
  • మూడు రోజుల క్రితమే అడిగాము
  • చంద్రబాబుది పక్షపాత ధోరణి
  • విజయవాడ ధర్నా చౌక్ లో ప్రారంభమైన బీజేపీ దీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హీనంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ, ఒకరోజు ఉపవాసానికి పిలుపు ఇవ్వగానే, విజయవాడలో దీక్ష చేసేందుకు అనుమతించాలని తాము పోలీసులకు దరఖాస్తు చేశామని చెప్పారు. తమకు అనుమతి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని ఆరోపించిన ఆయన, నాలుగేళ్ల పాటు కలిసుండి, నిధులు తీసుకుని, వాటి గురించి లెక్కలు చెప్పకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

తాము లెనిన్ సెంటర్ లో దీక్షకు అనుమతి అడిగామని, అనుమతిస్తారన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేసుకుంటుంటే, చివరకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంట్ స్తంభనకు తెలుగుదేశం పార్టీయే కారణమని ఆరోపించిన జీవీఎల్, ఒక్క చర్చ కూడా జరగనీయకుండా చూశారని, అవిశ్వాసంపై చర్చిస్తే, టీడీపీ బండారం బట్టబయలవుతుందని చంద్రబాబు భయపడ్డారని అన్నారు.

తమ ఉపవాస దీక్ష విషయంలో చంద్రబాబు పక్షపాత ధోరణితో వ్యవహరించారని అన్నారు. తామే సర్దుకుని చివరకు ధర్నా చౌక్ లో నిరసనకు నిర్ణయించుకున్నామని తెలిపారు. కాగా, విజయవాడ బీజేపీ నేతల ఉపవాస దీక్ష ధర్నాచౌక్ లో మొదలైంది.

More Telugu News