Narendra Modi: మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • రాఫెల్ కుంభకోణంలో రూ. 30 వేల కోట్లకు పైగా దోచుకున్నారు
  • బ్యాంకింగ్ వ్యవస్థను మోదీ సర్వనాశనం చేశారు
  • ముగ్గురు మోదీలు దేశాన్ని దోచుకుంటున్నారు

ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిప్పులు చెరిగారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో మోదీ అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. గతంలో బోఫోర్స్ కుంభకోణం ద్వారా కాంగ్రెస్ పార్టీ రూ. 16 వేల కోట్ల అవినీతికి పాల్పడితే... రాఫెల్ కుంభకోణం ద్వారా బీజేపీ రూ. 30 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బ్యాంకింగ్ వ్యవస్థను మోదీ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలే అతి పెద్ద దోపిడీదారులని అన్నారు.

పెట్రోల్ ధరలను ప్రతి రోజూ సమీక్షించుకునే విధానం ద్వారా కేంద్ర ఖజానాకు లక్షల కోట్లను జమ చేసుకుంటున్నారని బుచ్చయ్య మండిపడ్డారు. ఏపీ నుంచి పన్నుల రూపంలో ఎంతో పోగేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... తిరిగి ఏపీకి ఏమిస్తోందని ప్రశ్నించారు. గుజరాత్ లో చోటు చేసుకున్న అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదికపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకే, అన్నాడీఎంకే ఎంపీలతో లోక్ సభలో బీజేపీ ఆందోళన చేయిస్తోందని చెప్పారు. ముగ్గురు మోదీలు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

More Telugu News