south africa: స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ స్థానంలో వచ్చిన ముగ్గురు ఆటగాళ్లు చేసింది 12 పరుగులే.. నాలుగో టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు!

  • స్మిత్ స్థానంలో వచ్చిన రెన్షా చేసింది 8 పరుగులే
  • ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైన హ్యాండ్స్‌కోంబ్
  • నాలుగు పరుగులు మాత్రమే చేసిన బర్న్స్

బాల్ ట్యాంపరింగ్‌తో జట్టులో స్థానం కోల్పోయిన స్మిత్, వార్నర్, కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు తీవ్ర నిరాశ పరిచారు. దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. నిషేధానికి గురైన వారి స్థానంలో జట్టులోకి వచ్చిన రెన్షా, జో బర్న్స్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌లు ముగ్గురూ కలిసి 41 బంతులు ఆడి 12 పరుగులు మాత్రమే చేశారు. అందులో రెన్షా చేసిన 8 పరుగులే అత్యధికం కావడం మరో విశేషం. మొత్తం 32 బంతులు ఎదుర్కొన్న రెన్షా అతి కష్టం మీద 8 పరుగులు చేయగా బర్న్స్ 4 పరుగులు చేశాడు. హ్యాండ్స్‌కోంబ్ తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు.

మరోవైపు దక్షిణాఫ్రికా ఈ టెస్టులో పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అయిడెన్ మార్కరమ్ 152 పరుగులు చేయగా, టెంబా బవుమా 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఉస్మాన్ ఖావజా చేసిన 53 పరుగులే ఇప్పటికి అత్యధికం.

More Telugu News