Rapist: రేపిస్టులను పబ్లిక్‌గా కాల్చిపారేయాలి... బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • రేపిస్టులను కాల్చేందుకు షూటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలి
  • మహిళలపై వేధింపులకు పదేళ్ల జైలుశిక్ష విధించాలి
  • రేప్ చేసిన మైనర్‌ని జువనైల్‌గా పరిగణించరాదు

రేపిస్టులను బహిరంగంగా కాల్చిపారేయాలని బీజేపీకి చెందిన తేజ్‌పూర్ ఎంపీ రాంప్రసాద్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. "అత్యాచారం లాంటి హేయమైన నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా కాల్చేయాలి లేదా ఉరేయాలి. ఇలాంటి దారుణ ఘటనలకు ముగింపు పలకడానికి ఇదే ఏకైక మార్గం. మహిళలకు గౌరవం ఇవ్వని వారి పట్ల ఇలాగే వ్యవహరించాలి" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులను అంతమొందించడానికి షూటింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

అంతేకాక మహిళలపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా, వారిని ఉద్దేశపూర్వకంగా తాకినా అలాంటి మృగాలకు కనీసం పదేళ్ల జైలుశిక్షను విధించాలని ఆయన సూచించారు. అసోంలోని నాగావో జిల్లాలో గతవారం ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసి హతమార్చిన నేపథ్యంలో శర్మ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపిస్టుల్లో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. అత్యాచారం చేసిన మైనర్‌ని జువనైల్‌గా పరిగణించడాన్ని ఆయన తప్పుబట్టారు. అతన్ని కూడా ఇతరుల మాదిరిగానే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News