JDS: కర్ణాటకలో జేడీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా.. నేడు కాంగ్రెస్ తీర్థం!

  • రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీఎస్ రెబల్స్
  • రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
  • నలుగురి రాజీనామాలు ఆమోదించిన స్పీకర్

కర్ణాటకలో జేడీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. నేడు వీరు కాంగ్రెస్‌లో చేరనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశామని చెప్పిన వీరంతా శనివారం మూకమ్ముడిగా రాజీనామా చేశారు. ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది.

జహీర్ అహ్మద్ ఖాన్, అఖండ శ్రీనివాస్‌ మూర్తి, చలువరాయ స్వామి, ఇక్బాల్ అన్సారీ, బాలకృష్ణ, రమేశ్ బండి సిద్దె గౌడ, భీమా నాయక్‌లు పార్టీకి రాజీనామా చేసినట్టు జేడీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్‌బాబు తెలిపారు. 2016 రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌కు ఓటేసిందుకు జేడీఎస్ వీరందరినీ గతంలో సస్పెండ్ చేసింది.

శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్ మూడో అభ్యర్థి అయిన జీసీ చంద్రశేఖర్‌కు ఓటేశారు. రాజీనామా చేసిన వారిలో నలుగురు తమ సొంత నిర్ణయానుసారమే రాజీనామా చేసినట్టు పేర్కొనడంతో వారి రాజీనామాలు ఆమోదించినట్టు స్పీకర్ కేబీ కోలివడ్ తెలిపారు. కాగా, ఆదివారం తామంతా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు నాగమంగళ ఎమ్మెల్యే స్వామి తెలిపారు.

More Telugu News