Bride: యూపీలో దారుణం...వేలంపాటలో యువతి విక్రయం...!

  • యువతిని ఇటుక బట్టీ కూలీకి రూ.22 వేలకు అమ్మేసిన ఏజెంట్లు
  • మొత్తం సొమ్ము కట్టలేదని పెళ్లయ్యాక బ్రోకర్లు తిరిగి ఆమెను ఎత్తుకెళ్లిన వైనం
  • ఏజెంట్లపై పోలీసుల కేసు నమోదు...దర్యాప్తు


పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా, సురోర్‌పూర్ కలాన్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కొందరు ఏజెంట్లు వేలంపాటలో పశువును అమ్మినట్లుగా అమ్మేశారు. ఈ నెల 16న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళితే, ఇటుక బట్టీలో కూలీగా పనిచేసే ముకేశ్ అనే వ్యక్తికి సదరు యువతిని రూ.22 వేలకు బ్రోకర్లు వేలంపాటలో విక్రయించారు. అడ్వాన్సు కింద ముకేశ్ వారికి రూ.17,500 చెల్లించి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

కానీ, మిగిలిన మొత్తాన్ని అతను వారికి చెల్లించలేదు. దీంతో వారు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో మనస్తాపానికి గురైన ముకేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని యూపీ పోలీసులు తెలిపారు. ముకేశ్ ఆత్మహత్య కేసును విచారిస్తుండగా యువతి వేలంపాట విక్రయ ఘటన తమ దృష్టికి వచ్చిందని బాగ్‌పత్ సర్కిల్ అధికారి దిలీప్ సింగ్ తెలిపారు.

ముకేశ్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టవిరుద్ధంగా వధువుల అక్రమ రవాణా, విక్రయం వ్యాపారం చేస్తున్న సోనూ, మోను అనే ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. నిందితులు అమ్మాయిలను అసోం నుంచి తీసుకుచ్చి బాగ్‌పత్‍‌లో వేలంపాటలో విక్రయిస్తుంటారని ఆయన తెలిపారు.

More Telugu News