Andhra Pradesh: ఏపీ ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్ .. తలపడనున్న ముఖ్యమంత్రి, స్పీకర్ జట్లు

  • 24, 26 తేదిలలో స్పోర్ట్స్, గేమ్స్ మీట్ -2018
  • విజయవాడ లోని మున్సిపల్ స్టేడియాల్లో జరగనున్న పోటీలు 
  • తలపడనున్న ముఖ్యమంత్రి, స్పీకర్ జట్లు

ఏపీ ఎమ్మెల్యేల స్పోర్ట్స్, గేమ్స్ మీట్ - 2018 ని విజయవంతం చేయాలని క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఈ నెల 24, 26 తేదీలలో విజయవాడ లోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాల్ మునిసిపల్ ఇండోర్ స్టేడియంలలో ఈ క్రీడలు జరగనున్నట్టు తెలిపారు. శనివారం, సోమవారం జరిగే ఈ పోటీలలో ముఖ్యమంత్రి, స్పీకర్ జట్లు ఈ పోటీలలో పాల్గొననున్నట్టు చెప్పారు. క్రీడలలో పాల్గొనేందుకు ఇప్పటికే శాసన సభ్యులు (పురుషులు) 42 మంది, మహిళా శాసనసభ్యులు 12 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

ఎమ్మెల్యేలకు (పురుషులు)  క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడలలోనూ, మహిళా ఎమ్మెల్యేలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడలలో పోటీలు జరుగుతాయని అన్నారు. వీరిలో పలువురు సభ్యులు వివిధ క్రీడలలో పాల్గొంటున్నారని, ఇందుకోసం ఎమ్మెల్యేల (పురుషులు) నుండి 113 ఎంట్రీలు, మహిళా ఎమ్మెల్యేల నుండి 26 ఎంట్రీలు నమోదైనట్లు చెప్పారు.  

More Telugu News