Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత... ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీకి తరలింపు

  • కుమార్తెతో కలసి సిమ్లా పర్యటనలో ఉన్న సోనియా
  • నిన్న రాత్రి అస్వస్థత
  • తొలుత చండీగఢ్ కు, అక్కడి నుంచి ఢిల్లీకి తరలింపు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు లోనయ్యారు. తన కుమార్తె ప్రియాంక వాద్రాతో కలసి ఆమె సిమ్లా పర్యటనకు వెళ్లగా అక్కడ అనారోగ్యం పాలవడంతో నిన్న రాత్రి ఆమెను చండీగఢ్ కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సోనియాగాంధీని ఢిల్లీకి తీసుకెళ్లారు. చండీగఢ్ లోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్సకు సోనియా నిరాకరించడమే కారణమని ఓ అధికారి వెల్లడించారు.

దాంతో ఆమెను ఢిల్లీకి తరలించినట్టు చెప్పారు. సోనియాగాంధీ పరిస్థితి నిలకడగానే ఉందని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రమేష్ చంద్ స్పష్టం చేశారు. సోనియాగాంధీ, తన కుమార్తె ప్రియాంకతో కలసి బుధవారం సిమ్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చరబ్రా గ్రామాన్ని సందర్శించారు. అక్కడే ప్రియాంకా కాటేజీ నిర్మాణం జరుగుతోంది.

More Telugu News