Kesineni Nani: 'కేంద్రం చెప్పింది', 'కేంద్రం ఇచ్చింది' అంటూ ఎంపీలందరికీ మెసేజ్ పంపిన కేశినేని నాని!

  • ఎంపీలకు వాట్స్ యాప్ పోస్టు పంపిన కేశినేని నాని
  • హోదా ఇస్తామని చెప్పి ప్యాకేజీ అన్న కేంద్రం
  • ప్యాకేజీ నిధులనూ ఇవ్వలేదని వెల్లడి
  • చర్చనీయాంశంగా మారిన నాని పోస్టు

టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఎంపీలందరికీ పంపిన ఓ వాట్సా యాప్ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'కేంద్రం చెప్పింది', 'కేంద్రం ఇచ్చింది' అంటూ ఓ పోస్టును వాట్స్ యాప్ లో షేర్ చేసిన ఆయన, ఆపై దాన్ని ఫేస్ బుక్ లోనూ పెట్టారు. 'ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మన హక్కు ప్రత్యేక హోదా' అని హెడ్డింగ్ పెట్టి, "కేంద్ర సహాయం అందించేందుకు ప్రత్యేక హోదా ప్రతిపత్తిని విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ఇస్తాము. ఇది ఈ రాష్ట్రం ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడేందుకు దోహదపడుతుంది" అని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు.

ఆపై 'కేంద్రం ఇచ్చింది' ఇదే నంటూ "14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వమన్నందున హోదాకు సరిపడా ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తాం. కాని ఇప్పటివరకూ ఏ విధమైన ప్రత్యేక సాయం అందలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదని పార్లమెంట్ లో హోమ్ శాఖ సహాయమంత్రి తెలిపారు" అని రాశారు. బీజేపీ అబద్ధాలు చెబుతోందని, అందుకు ఇదే సాక్ష్యమని ఆయన ఈ పోస్టు చేయగా, దీన్ని చూసిన ఎంపీలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News