Chandrababu: చంద్రబాబుకు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదు.. పవన్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి: పార్థసారథి

  • ఒకరికి అనుకూలంగానో లేక మరొకరికి వ్యతిరేకంగానో ఉన్నంత మాత్రాన కేసులు కొట్టేస్తారా?
  • ప్రజల దృష్టిని మరల్చేందుకే జగన్ కేసుల ప్రస్తావన
  • టీడీపీతో ఉన్న పవన్ కూడా అవినీతి గురించి మాట్లాడారు

వారివారి సొంత సమస్యలు, కారణాల వల్లే టీడీపీ అవిశ్వాస తీర్మానానికి దేశంలోని ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయని... దీన్ని కూడా తన ఘనతగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటున్నారని వైసీపీ నేత పార్థసారథి విమర్శించారు. ఇది చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు మంచి పాలన అందిస్తుంటే... రాష్ట్రంలో వామపక్షాలు ఎందుకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ప్రశ్నించారు. కేవలం బీజేపీపై వ్యతిరేకత కారణంగానే అవిశ్వాసానికి వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.

నాలుగేళ్లుగా టీడీపీతో కలసి ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా టీడీపీలోని అవినీతి గురించి మాట్లాడారని పార్థసారథి అన్నారు. పవన్ ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే జగన్ పై ఉన్న కేసులను చంద్రబాబు ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. ఒకరికి అనుకూలంగానో లేక మరొకరికి వ్యతిరేకంగానో ఉన్నంత మాత్రాన కేసులు ఎలా కొట్టేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు న్యాయ వ్యవస్థపై ఎంత గౌరవం ఉందో... ఆయన వ్యాఖ్యలే చెబుతున్నాయని తెలిపారు.

More Telugu News