Chandrababu: చంద్రబాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి కారణం ఇదే: విజయసాయిరెడ్డి

  • రంగులు మార్చడంలో చంద్రబాబు దిట్ట
  • తన నీడను తానే నమ్మలేరు
  • చిత్తశుద్ధి ఉంటే వైసీపీతో కలసి రావాలి

రంగులు మార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించినవారు మరెవరూ లేరని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అవసరాన్ని బట్టి పూటకో మాటను మార్చడం చంద్రబాబు నైజమని విమర్శించారు. గతంలో రాత్రికి రాత్రే ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనని చంద్రబాబు స్వాగతించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఎలా మాట మార్చారో కూడా అందరికీ తెలుసని చెప్పారు. చంద్రబాబు తన నీడను తానే నమ్మలేరని... ఇంకా చెప్పాలంటే కన్న కొడుకు నారా లోకేష్ ను కూడా ఆయన నమ్మడం లేదని చెప్పారు.

చంద్రబాబులాంటి వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టమని విజయసాయి అన్నారు. చంద్రబాబు వల్ల ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రయోజనం లేదని, ప్రధాని అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెబుతున్నారని... రంగులు మార్చే నైజం చంద్రబాబుది కాబట్టే మోదీ ఆయనను విశ్వసించలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... వైసీపీతో కలసి రావాలని చెప్పారు. వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

More Telugu News