KTR: ప్రత్యేక ప్యాకేజీలతో మభ్యపెట్టాలని చూశారు.. చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్

  • మీ పోరాటంలో తప్పులేదు.. కానీ మాపై నిందలొద్దు
  • పోరాడితేనే తెలంగాణ వచ్చింది.. సెంటిమెంట్‌తో కాదు
  • చంద్రబాబు వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో కేటీఆర్

సెంటిమెంట్ కారణంగానే తెలంగాణ ఇచ్చారన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్‌పై రాలేదని, ఆత్మగౌరవంతో పోరాడి సాధించుకున్నామని పేర్కొన్నారు. పోరాటాన్ని నీరు గార్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారని, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి నీరుగార్చే ప్రయత్నం చేసినా తాము పట్టువిడువలేదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీలకు తామెప్పుడూ ఆశపడలేదని, పట్టు జారకుండా పోరాడడం వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి  చంద్రబాబు మాట్లాడడంలో తప్పులేదని, హక్కుల కోసం పోరాడవచ్చని కానీ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను తక్కువ చేసి మాట్లాడొద్దని హితవు పలుకుతూ ట్వీట్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు బదులిస్తూ సెంటిమెంటు కారణంగానే తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన విషయం తెలిసిందే.  

More Telugu News