Tripura: అన్నంత పనీ చేశారు... తమిళనాడులో పెరియార్ రామస్వామి విగ్రహం ధ్వంసం... తీవ్ర ఉద్రిక్తత!

  • త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేత
  • రామస్వామి నాయకర్ తీవ్రవాదంటూ ట్వీట్ చేసిన హెచ్ రాజా
  • ఆయన విగ్రహాలు కూలుస్తామని హెచ్చరికలు
  • తిరుపుత్తూర్ కార్పొరేషన్ లోని విగ్రహం ధ్వంసం

ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్న అనందంలో ఉన్న బీజేపీ శ్రేణులు, త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చి వేసిన తరువాత, 'ఇవాళ త్రిపురలో లెనిన్, రేపు కుల తీవ్రవాది రామస్వామి నాయకర్' అంటూ ట్విట్టర్ ద్వారా బీజేపీ నేత హెచ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ట్వీట్ చేసిన గంటల వ్యవధిలో వెల్లూరు జిల్లాలో ఓ పెరియార్ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి, రాజా చెప్పినట్టుగానే చేశారు బీజేపీ కార్యకర్తలు.

దీంతో తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. తిరుపుత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోకి గత రాత్రి 9 గంటల సమయంలో జొరబడిన ఆందోళనకారులు, విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జరిగిన ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. విగ్రహం కళ్లు, ముక్కు దెబ్బతిన్నాయని, ఓ బీజేపీ కార్యకర్త, మరో సీపీఐ కార్యకర్త మద్యం మత్తులో ఈ పని చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పెరియార్ రామస్వామి విగ్రహం ధ్వంసంపై తమిళ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ఉదయం నిరసనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి. 

More Telugu News