Hyderabad: రాంగ్ రూట్ లో వచ్చి, హైదరాబాద్ లో ఫ్లైఓవర్ పై నుంచి కిందపడ్డ ఐటీ ఉద్యోగుల బస్సు

  • బుధవారం తెల్లవారుజామున ప్రమాదం
  • ఆ సమయంలో బస్సులో 40 మంది ఐటీ ఉద్యోగులు
  • డ్రైవర్ నిద్రమత్తే కారణమన్న పోలీసులు

హైదరాబాద్ మూసాపేట ఫ్లయ్ ఓవర్ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, మాదాపూర్ లోని ఐటీ కంపెనీ సెయింట్‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగులను  తీసుకు వెళుతున్న సోని ట్రావెల్స్‌ కు చెందిన బస్సు  (ఏపీ 28 టీఏ 7676), అమీర్ పేట నుంచి చింతల్ వైపు వెళ్తూ, రెయిలింగ్ ను, డివైడర్ ను ఢీకొట్టి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ఉద్యోగులు ఉండగా, బస్సు సుమారు 7 అడుగుల పైనుంచి కింద పడింది.

 ఫ్లైఓవర్ మొదట్లోనే ప్రమాదం జరగడంతో ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తుకు తోడు, రాంగ్ రూట్ లో వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని, ఎడమవైపు నుంచి వెళ్లాల్సిన బస్సు, కుడివైపు పడిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని అన్నారు.

More Telugu News