Odisha: జైల్లో ఉన్న మావో నేత సవ్యసాచి పండాను విడుదల చేయకుంటే కిడ్నాప్ చేసిన వైద్య విద్యార్థిని చంపేస్తాం... ఒడిశాలో కలకలం!

  • రెండు వారాల క్రితం అదృశ్యమైన ఎయిమ్స్ విద్యార్థి
  • తామే కిడ్నాప్ చేశామంటూ మావోయిస్టుల పోస్టర్
  • వారంలోగా సవ్యసాచిని విడుదల చేయాలని డిమాండ్

భువనేశ్వర్ లోని ఎయిమ్స్ విద్యార్థి సొహైల్ అజీజ్ అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం జైల్లో ఉన్న మావోయిస్టు నేత సవ్యసాచి పండాను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే తాము కిడ్నాప్ చేసిన వైద్య విద్యార్థిని హతమారుస్తామని మావోయిస్టుల పేరిట ఓ పోస్టర్ వెలవడం కలకలం రేపింది. భువనేశ్వర్ లోని బర్ముండా బస్టాండులో ఈ పోస్టర్ కనిపించగా, ఏడు రోజుల్లో సవ్యసాచిని విడుదల చేయాలని, లేకుంటే విద్యార్థిని చంపేస్తామని మావోలు హెచ్చరించారు.

ఆపై ఈ నెల 11న భువనేశ్వర్ రైల్వేస్టేషన్ ను, బస్టాండును బాంబులేసి నేలమట్టం చేస్తామని కూడా లేఖలో ఉంది. కాగా, ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న సోహైల్ అజీజ్ రెండు వారాల క్రితం అదృశ్యం కాగా, రాష్ట్ర పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు. ఈ పోస్టర్ ను మావోలే రాశారా? లేక ఎవరైనా ఆకతాయిలపనా? అన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు స్పష్టం చేయలేమని నగర కమిషనల్ వైబీ ఖురానియా వెల్లడించారు.

More Telugu News