BJP: మేము నోరు తెరిస్తే చాలా చెప్పాల్సి వస్తుంది: టీడీపీకి విష్ణుకుమార్ రాజు హెచ్చరిక

  • మిత్రధర్మాన్ని పాటిస్తున్నది బీజేపీ మాత్రమే
  • మా నోరు తెరవనీయద్దు
  • మేమూ లెక్కలు తీయగలం
  • బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో టీడీపీ, ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నాయి కాబట్టే తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఆ పని చేయడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీ వైఖరిపై మండిపడ్డారు.

తాము నోరు తెరిస్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుందని, పరిస్థితి అంతదూరం రానీయకుండా తన నేతలను చంద్రబాబు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి ప్రధాని ఎంతో కృషి చేస్తుంటే, ఈ తరహా విమర్శలు సరికాదని హితవు పలికారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పటికే ఎంతో సాయం అందిందని, ఏపీకి ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని అన్నారు. తామూ లెక్కలు తీయగలమని, చాలా అంశాలపై తమ వద్ద సమాచారం ఉందని ఆయన అన్నారు. టీడీపీ నేతలు మోదీని నిత్యమూ తూలనాడుతుంటే, చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు.

కాగా, నిన్న విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి రైలు ఆకృతిలో ప్లెక్సీలు తయారు చేయించి, వాటి మధ్య నిలబడి, 'మోదీ మెడలు వంచుతాం' అంటూ వినూత్న నిరసన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో మోదీ వేషంలోని ఓ వ్యక్తిని మెడ పట్టుకుని కిందకు వంచుతుండటం వంటివి బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయనే చెప్పాలి.

More Telugu News