delhi telugu cuple: మద్యానికి బానిసైన భర్తను విషంతో వదిలించుకున్న భార్య!

  • మద్యానికి బానిసై, 12 లక్షలు అప్పులు చేసిన మూర్తి
  • భర్తను వదిలించుకునేందుకు తాంత్రికుడ్ని కలిసిన రమ
  • తాంత్రికుడు ఇచ్చిన పదార్థాన్ని తినిపించిన భార్య 

మద్యానికి బానిసై, అప్పులు చేస్తున్న భర్తను విషంతో వదిలించుకుందో ఇల్లాలు. ఆ వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ కు చెందిన డీఎస్‌ మూర్తి, ఆయన భార్య రమ ఢిల్లీలోని రాజాబజార్‌ లో నివాసముంటున్నారు. రమ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాగా, మూర్తి ఓ స్థిరాస్తి సంస్థలో పనిచేస్తున్నారు. గత నెల 26న రోడ్డుపక్కన అనుమానాస్పదంగా పడి ఉన్నారంటూ మూర్తిని ఓ మహిళ ప్రభుత్వాసుపత్రిలో చేర్చివెళ్లిపోయింది. రెండు రోజుల తరువాత మూర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆయన డీఎస్ మూర్తిగా గుర్తించారు. అనంతరం రమకు సమాచారం అందించారు. తర్వాత దర్యాప్తులో రమే ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్టు గుర్తించారు. దీంతో ఆమెను విచారించారు. మద్యానికి బానిసైన మూర్తి, 12 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడని ఆమె చెప్పింది. మద్యంతాగి వచ్చే చేసే అల్లరితో పరువు పోయేదని తెలిపింది. దీంతో అతనిని వదిలించుకోవాలని భావించి, దక్షిణపురిలోని తాంత్రికుడు శ్యాంసింగ్‌ ను ఆశ్రయించానని వెల్లడించింది. శ్యాంసింగ్‌ ఇచ్చిన పదార్థాన్ని తినిపించిన వెంటనే మూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని, దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించానని చెప్పింది. దీంతో రమపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News