త్రిపురలో గెలిచిన మర్నాడే బీజేపీ షాకిచ్చిన మిత్రపక్షం!
- ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను తెరపైకి తెచ్చిన ఐపీఎఫ్టీ
- అధికారంలో ఏ పార్టీ ఉన్నా తమ వైఖరిలో మార్పు ఉండదన్న అధ్యక్షుడు ఎన్సీ దేవ్ వర్మ
- బీజేపీకి ఆదిలోనే హంసపాదు
త్రిపురలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీలు కలిసి పోటీ చేశాయి. ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి ఘన విజయం సాధించి ఏళ్లుగా పాతుకుపోయిన లెఫ్ట్ పార్టీకి షాకిచ్చింది. 1997లో ఏర్పాటైన ఐఫీఎఫ్టీ తొలి నుంచీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ చేస్తూనే ఉంది. కాగా, ఐపీఎఫ్టీ ప్రత్యేక గళం అందుకున్నా ప్రస్తుతానికి బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సంఖ్యాబలం బీజేపీకి ఉంది. అయితే, అధికారాన్ని చేజిక్కించుకున్న మర్నాడే ఇలా ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐపీఎఫ్టీ డిమాండ్పై బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.