Jahnavikapoor: తల్లి శ్రీదేవికి హృదయం ద్రవించిపోయే లేఖ రాసిన జాహ్నవి!

  • తన 21వ పుట్టినరోజున తల్లికి జాహ్నవి సుదీర్ఘ లేఖ
  • గర్వపడే స్థాయికి చేరుకుంటానని తల్లికి ప్రామిస్
  • గర్వపడే స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తానని తల్లికి ప్రామిస్

కొన్ని రోజుల కిందటే అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచి వెళ్లిపోయిన సౌందర్యరాశి శ్రీదేవి తన ఇద్దరు కుమార్తెలను అందరి తల్లులలాగే ఎంతో ప్రేమగానూ, అంతే బాధ్యతగానూ పెంచారని బాలీవుడ్ వర్గాల్లోని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఆమె పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ 'ధడక్' చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ప్రవేశిస్తోంది.

స్నేహితురాలి వంటి తన తల్లి మరణం ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తల్లిపై ఉన్న ప్రేమను ఆమె మరణానంతరం జాహ్నవి శనివారం తన 21వ పుట్టినరోజును పురస్కరించుకుని ఓ లేఖ రూపంలో రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో తల్లిదండ్రులను ప్రేమించండి అంటూ పిల్లలకు ఆమె సందేశమిచ్చింది. హృదయం ద్రవించుకుపోయేలా ఉన్న ఆ లేఖ సారాంశం క్లుప్తంగా....

"అమ్మా...నువ్వు మాతో లేకపోయినా ఇప్పటికీ నీ ప్రేమానుభూతిని పొందుతూనే ఉన్నాం. బాధ, విచారం నుంచి నువ్వు నన్ను కాపాడుతున్న భావన కలుగుతోంది. కళ్లు మూసుకున్న ప్రతిసారీ మంచి విషయాలు మాత్రమే నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. అది నీ వల్లేనని నాకు తెలుసు. మా జీవితాలకు నువ్వో వరం. నువ్వు ఈ ప్రపంచం కోసం కాదు. నువ్వు అతి మంచిదానివి, అతి స్వచ్ఛమైన దానివి, అత్యంత ప్రేమమూర్తివి. అందుకేనేమో ఆ దేవుడు నిన్ను తిరిగి తన వద్దకే తీసుకెళ్లిపోయాడు.

నేను సంతోషంగా ఉన్నానని ఎప్పుడూ చెబుతుండేదాన్ని. ఇప్పుడు నాకనిపిస్తోంది, అదంతా నీ వల్లేనని. నాకు ఎల్లప్పుడూ కావాల్సింది నువ్వు మాత్రమే. నువ్వు నా ఆత్మలో భాగం. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నీ జీవితమంతా ఇవ్వడమే చేశావు. అదే విధంగా నిన్ను తిరిగి సంతోషపెట్టాలని నేను అనుకుంటున్నాను. నువ్వు గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. నిన్ను చూసి మేము గర్వపడినట్లుగా ఏదో ఓ రోజు నన్ను చూసి నువ్వు గర్వపడతావన్న ఆశతో ప్రతిరోజూ కష్టపడుతాను.

అదే ఆలోచనతోనే రోజూ నిద్ర లేస్తానని నీకు ఒట్టేసి చెబుతున్నాను. ఎందుకంటే... నువ్వు ఇక్కడే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నువ్వు నాలోనూ, చెల్లెలు ఖుషీలోనూ, పాపా (తండ్రి)లోనూ ఉన్నావు. నువ్వు మాపై వేసిన ముద్ర చాలా బలమైనది. మేము ముందుకు సాగడానికి అది చాలు...." అంటూ జాహ్నవి తన తల్లికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More Telugu News