Sridevi: కుమార్తె తొలి సినిమా చూడకుండానే దివికేగిన అతిలోకసుందరి!

  • ఈ ఏడాదిలో రిలీజ్ కానున్న జాహ్నవి కపూర్ 'ధడక్' చిత్రం
  • సవాళ్లకు తన కుమార్తె రెడీ అని గతంలోనే ప్రకటన
  •  శ్రీదేవి చివరి చిత్రం 'జీరో' వచ్చే డిసెంబర్లో విడుదల 

దాదాపు 260 సినిమాల్లో నటించి అశేష అభిమానులను సొంతం చేసుకున్న నటి శ్రీదేవి నిన్న హఠాన్మరణం చెంది అభిమానులను శోకంలో ముంచెత్తింది. తన మిత్రులు, శ్రేయోభిలాషులతో ఎప్పుడూ శ్రీదేవి తన బిడ్డల భవిష్యత్ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆమె అందాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె బిడ్డలు కూడా సినిమా పరిశ్రమలోకే రావడం ఆమె అభిమానులకు ఆనందం కలిగించే విషయం. శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ బాలీవుడ్‌లో 'ధడక్' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఇందులో హీరోగా ఇషాన్ ఖట్టర్ నటించాడు.

ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తన కుమార్తె తొలి సినిమా కోసం అందరిలాగే శ్రీదేవి కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. కానీ, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఏ రంగంలోనైనా సవాళ్లు ఉంటాయని, సినీ పరిశ్రమ అందుకు అతీతం కాదని, తన కుమార్తె వాటిని ఎదుర్కొనేందుకు రెడీగా ఉందని శ్రీదేవి గతంలోనే మీడియాతో అన్నారు. కానీ, తన కుమార్తె అభినయాన్ని చూడకూండానే ఈ అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్లిపోవడం బాధాకరం. బాలీవుడ్‌లో శ్రీదేవి చివరగా నటించిన 'జీరో' చిత్రం వచ్చే డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News