attack: కృష్ణాజిల్లా పెనమలూరులో నడిరోడ్డుపై విద్యార్థుల ఘర్షణ.. భయపడ్డ స్థానికులు

  • కృష్ణాజిల్లా పెనమలూరులో ఘటన
  • పోలీస్ స్టేషన్ ఎదురుగానే రెచ్చిపోయిన యువకులు
  • మీడియాపై కూడా దాడి

నడిరోడ్డుపై యువకులు బీభత్సం సృష్టించిన ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌కు చెందిన విద్యార్థులే రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరగడం గమనార్హం. ఇరు గ్రూపుల విద్యార్థులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకుంటుండంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ఇళ్లల్లోంచి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అంతేకాదు, అక్కడకు చేరుకున్న మీడియాపై కూడా దాడికి దిగారు. ఈ దాడిలో ఓ కెమెరా ధ్వంసం అయింది. ఇద్దరు విలేకరులకు గాయాలయినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా పోలీసులు స్టేషన్ నుంచి బయటకు రాలేదు. ఓ విద్యార్థి హాస్టల్ నిర్వాహకులకు డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో ఆ విద్యార్థిని హాస్టల్ నిర్వాహకులు చితక్కొట్టడంతో ఈ వివాదం మొదలైనట్లు తెలిసింది.

More Telugu News