Andhra Pradesh: రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టిండి!: ఏపీ సీఎస్ దినేష్ కుమార్

  • నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే భారీ జరిమానా
  • అతివేగాన్ని నివారించేందుకు స్పీడ్ గన్ లు ఏర్పాటు చేయాలి 
  • ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశాలు

రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి నుంచి భారీ ఎత్తున అపరాధ రుసుము వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. హోం, ఆర్ అండ్ బి, వైద్య, ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖాధికారులతో సచివాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జిల్లాల వారీగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఎక్కువ ప్రమాదాలు వాహనాల వేగం వల్లే జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాలు జరిగిన ఫొటోలను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని, ఫొటోల ప్రదర్శనతో రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలుగుతుందని సూచించారు.

అదే సమయంలో, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించని వారితో పాటు మద్యం తాగి వాహనం నడిపే వారి నుంచి భారీ ఎత్తున అపరాధ రుసుములు వసూలు చేయాలని, అతివేగాన్ని నివారించే నిమిత్తం స్పీడ్ గన్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

 అంతకుముందు రాష్ట్రంలో రోడ్డు సేఫ్టీ ఫండ్ కోసం రూ.10 కోట్ల కేటాయింపునకు సమావేశం ఆమోదం తెలిపింది. ఆ మొత్తంలో రూ.2.11 కోట్లను కలెక్టర్ల అధ్యక్షతన ఉన్న జిల్లా స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీల వినతిపై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో రూ.8 కోట్లను రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగంచనున్నట్టు చెప్పారు.  

More Telugu News