Nirav modi: నీరవ్ మోదీ పారిపోలేదు... వ్యాపార పర్యటనపైనే విదేశానికి వెళ్లారు: న్యాయవాది ప్రకటన

షార్ట్స్‌లో చూడండి
వజ్రాభరణాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,400 కోట్ల మేర మోసం చేసిన నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారంటూ వస్తున్న వార్తలను ఆయన తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఖండించారు. ఈ మేరకు న్యాయవాది విజయ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. నీరవ్ మోదీ పారిపోలేదని, వ్యాపార అవసరాల కోసమే దేశం వెలుపల ఉన్నారని స్పష్టం చేశారు.

‘‘పరారీలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ, ఆయన (నీరవ్ మోదీ) పారిపోలేదు. ఆయనకు అంతర్జాతీయంగా వ్యాపారం ఉంది. ఆ వ్యాపార అవసరాల కోసమే దేశం విడిచి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు కొందరు విదేశీ జాతీయులు. వారు ఎక్కువ సమయం విదేశాల్లోనే నివాసం ఉంటారు’’ అని తెలిపారు.

పనిలో పనిగా న్యాయవాది విజయ్ అగర్వాల్ పీఎన్ బీ వ్యవహారాన్ని కూడా తప్పుబట్టారు. ‘‘మొత్తం వ్యవహారమంతా పీఎన్ బీకి తెలిసే జరిగింది. బ్యాంకు కోట్లాది రూపాయలను కమిషన్ గా తీసుకుంది. కానీ, ఇప్పుడు అంగీకరించడం లేదు. ఇవన్నీ బ్యాంకు వాణిజ్య లావాదేవీల్లో భాగం. అయితే వీటిని ఇప్పుడు మోసంగా బ్యాంకు చెబుతోంది’’ అని విజయ్ అగర్వాల్ ఆరోపించారు. రూ.5,000 కోట్ల విలువైన ఆస్తులను వదిలేసి ఆయన దేశం విడిచి ఎందుకు వెళతారని ప్రశ్నించారు. సీబీఐ చార్జ్ షీటు ఫైల్ చేసిన తర్వాత తమ విధానాన్ని ఆచరణలో పెడతామని చెప్పారు.
Go Back to Shorts
Nirav modi

More Telugu News