Manikyala Rao: మాకు నష్టం వెంట్రుక మాత్రమే... టీడీపీకి మిగిలేది మాత్రం బోడిగుండు!: ఏపీ మంత్రి మాణిక్యాలరావు కీలక వ్యాఖ్య

  • విడిపోవాలని మాకు లేదు
  • రాష్ట్రంలో మేము వెంట్రుక వంటి వాళ్లమని తెలుసు
  • తెగదెంపులు చేసుకుంటే నష్టమేమీ ఉండదు
  • అరుణ్ జైట్లీని ఏపీకి ఆహ్వానిస్తున్నాం

ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తును తెంచుకునే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదంటూనే, ఆ పార్టీ నాయకుల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న బీజేపీ నేత, ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సెక్రటేరియట్ లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఏపీలో తాము వెంట్రుక వంటి వాళ్లమని, కొండకు ఓ వెంట్రుకను కట్టి లాగుతున్నామని అన్నారు.

వస్తే కొండ వస్తుందని, టీడీపీతో తెగదెంపులు చేసుకుంటే, ఓ వెంట్రుకపోయినట్టని వ్యాఖ్యానించిన ఆయన, అదే వాళ్లకు మాత్రం బోడిగుండు మిగులుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఏపీకి తీసుకువచ్చి, కేంద్రం చేస్తున్న సాయం గురించి ఆయన నోటి ద్వారానే ప్రజలకు వివరించేలా చేస్తామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో ఓ మిత్రపక్షమేనని, వారు వెళ్లిపోయినా కేంద్ర ప్రభుత్వం ఏమీ పడిపోదని అన్నారు. గ్రామగ్రామానా సభలు పెట్టి కేంద్రసాయం గురించి ప్రజల్లో అవగాహన తెస్తామని అన్నారు.

More Telugu News