Pakistan: ముచ్చటగా మూడోసారి పెళ్లికొడుకైన ఇమ్రాన్ ఖాన్!

  • మత బోధకురాలు బుష్రా మనేకాను మూడో వివాహం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్
  • ఇమ్రాన్ కు ఇద్దరు కుమారులు, మనేకాకు ఐదుగురు సంతానం
  • మనేకా సోదరుడి నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం

 మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ముచ్చటగా మూడో సారి పెళ్లికొడుకయ్యారు. మత బోధనలు చేసే బుష్రా మనేకాను లాహోర్‌ లోని ఆమె సోదరుడి నివాసంలో కొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. 1995లో బ్రిటిష్‌ కు చెందిన బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌ స్మిత్‌ ను ఆయన వివాహం చేసుకున్నారు. వీరి తొమ్మిదేళ్ల దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కుమారులున్నారు. అనంతరం భేదాభిప్రాయాల నేపథ్యంలో వారిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు.

 అనంతరం ఇమ్రాన్ ఖాన్ 2015లో టీవీ యాంకర్‌ రెహామ్‌ ఖాన్‌ ను వివాహం చేసుకున్నారు. పది నెలల దాంపత్యం తరువాత విడిపోయారు. గత జనవరి 1న ఇమ్రాన్‌ ఖాన్‌, బుష్రా మనేకాను వివాహం చేసుకున్నారని పుకార్లు షికారు చేశాయి. అయితే వాటిని ఆయన ఖండించారు. తాను ఆధ్యాత్మిక సలహాలు తీసుకునేందుకు మాత్రమే ఆమె వద్దకు వెళుతున్నానని ఇమ్రాన్ ఖాన్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ పుకార్లు ఆగకపోవడంతో వాటి ప్రభావం పార్టీపై పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను వివాహం చేసుకుంటానని ఆయన గత నెల ప్రకటించారు.

బుష్రా మనేకాకు గతంలో వివాహం జరిగింది. మొదటి భర్తతో ఆమెకు ఐదుగురు సంతానం వున్నారు. గత నెల ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారి వివాహ విషయాన్ని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ చౌదరి ధ్రువీకరించారు. త్వరలో అతిథులతో సింపుల్‌ గా వలీమా డిన్నర్‌ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పీటీఐ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు ముఫ్తీ ముహమ్మద్‌ సయీద్‌ వారి నిఖా జరిపించారని ఆయన చెప్పారు. ఈ మేరకు వారి వివాహానికి సంబంధించిన ఫొటోలను ఆయన విడుదల చేశారు. 

More Telugu News