డ్రోన్లతో ఫొటోలు తీసి.. 15 రోజులకు ఒకసారి నాకు చూపించండి: చంద్రబాబు ఆదేశం

  • అమరావతి పనుల్లో వేగం పెంచండి
  • జాప్యం జరిగితే ఉపేక్షించను
  • పనులను డ్రోన్లతో చిత్రీకరించండి
రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. అమరావతిలోని రహదారులు, గృహసముదాయాలు, ఇతర మౌలికసదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైతే... ఆ పనులకు సంబంధించిన బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని హెచ్చరించారు.

సీఆర్డీయే, ఏడీసీ, నిర్మాణ సంస్థల అధికారులు, ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సహకారంతో డ్రోన్ల ద్వారా రాజధాని నిర్మాణ పనులను ఫొటోలు తీయించాలని... ప్రతి 15 రోజులకు ఒకసారి వాటిని తనకు చూపించాలని ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తయితేనే పెట్టుబడిదారులు ఇక్కడకు వస్తారని చెప్పారు. పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా... వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
amaravathi
dnone
crda
construction

More Telugu News