Chandrababu: చంద్రబాబు నాయుడు సరికొత్త రికార్డు.. దేశంలోని సంపన్న సీఎంలలో అగ్రస్థానం.. నాలుగో ప్లేస్‌లో కేసీఆర్!

  • చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.177 కోట్లు
  • కేసీఆర్ వద్ద సుమారు రూ.15 కోట్ల విలువైన ఆస్తులు
  • అత్యంత పేద ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్
  • కేసీఆర్‌, చంద్రబాబుపై కేసులు
  • జాబితా వెల్లడించిన ఏడీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో రికార్డు సృష్టించారు. దేశంలోని అత్యంత సంపన్న సీఎంగా రికార్డులకెక్కారు. ఆయన మొత్తం (స్థిర, చర) ఆస్తుల విలువ సుమారు రూ.177 కోట్లని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. చంద్రబాబు తర్వాత రెండో ధనిక సీఎంగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.129 కోట్లకు పైనే.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మూడో స్థానాన్ని ఆక్రమించారు. రూ.15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాలుగో స్థానంలో నిలిచారు. దేశంలోని అత్యంత పేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ తొలి స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో స్థానంలో, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మూడో స్థానంలో ఉన్నారు. సీపీఎంకు చెందిన మాణిక్ సర్కార్ ఆస్తుల విలువ 26,83,195 మాత్రమే. మమతా బెనర్జీ ఆస్తులు రూ.30 లక్షలు కాగా, మెహబూబా ముఫ్తీ ఆస్తుల విలువ రూ.55 లక్షలని ఏడీఆర్ పేర్కొంది. మమతా బెనర్జీ వద్ద రూపాయి విలువైన స్థిరాస్తి కూడా లేకపోవడం విశేషం.

మొత్తం ముఖ్యమంత్రులలో 11 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయి. చంద్రబాబుపై 3, కేసీఆర్‌పై 2 కేసులు నమోదై ఉండగా వీటిలో ఒకటి క్రిమినల్ కేసు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై అత్యధికంగా 22 కేసులు నమోదయ్యాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పది కేసులు నమోదయ్యాయి. మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో 20 మందికి క్లీన్ రికార్డు ఉండగా 11 మంది (35 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో 8 (26 శాతం) అత్యంత తీవ్రమైన కేసులు.

More Telugu News