union independent minister: భూకబ్జా కేసులో కేంద్ర మంత్రి గిరిరాజ్ పై కేసు నమోదు!

  • దళిత వ్యక్తి భూమి కబ్జా కేసు
  • కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి గిరిరాజ్ పేరు
  • ఒరిజినల్ ఓనర్ ద్వారానే భూమి కొన్నానన్న కేంద్ర మంత్రి

ఓ దళిత వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేసిన ఘటనలో కేంద్ర మంత్రి గిరిరాజ్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. బీహార్ దానాపూర్ లోని ఓ స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి పేరును చేర్చారు. కేసు వివరాల్లోకి వెళ్తే రామ్ నారాయణ్ ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన భూమి కబ్జాకు గురైంది. తప్పుడు సంతకాలతో, అధికారుల అండతో ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనికి సంబంధించి బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ లో 25వ నిందితుడిగా కేంద్ర మంత్రి పేరును చేర్చారు.

ఈ కేసుపై గిరిరాజ్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో తాను ఒక స్థలాన్ని కొన్నానని... ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ ద్వారానే ఆ భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. ఆ భూమి ఫిర్యాదుదారుడిది కాదని అన్నారు. ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి పేరు చేర్చడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆర్జేడీ విమర్శలకు దిగింది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పుడు ఈ కబ్జా వ్యవహారంపై ఏం మాట్లాడతారని మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. గిరిరాజ్ రాజీనామాను నితీష్ కోరగలరా? అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News