Hardik Patel: మమతా బెనర్జీ ‘లేడీ గాంధీ’.. ప్రశంసించిన హార్ధిక్ పటేల్

  • మమతా బెనర్జీని కలిసిన పటీదార్ ఉద్యమ నేత
  • 90 నిమిషాలు భేటీ
  • ఇందిరాగాంధీ స్థాయికి చేరుకున్నారని ప్రశంస
  • ఆమె సింప్లిసిటీ నచ్చిందన్న హార్దిక్

గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ (24) శుక్రవారం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. ఈ సందర్భంగా తృణమూల్ పార్టీ చీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల కోసం అలుపెరగకుండా పోరాడుతున్న ఆమె ఇందిరాగాంధీ అంతటి స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. ‘‘ఈ రోజు నేను ‘లేడీ గాంధీ’, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిని కలిశా" అని హార్దిక్ ట్వీట్ చేశారు.

మమతాను హార్దిక్ కలవడం ఇదే తొలిసారి. ఆమెతో దాదాపు 90 నిమిషాల పాటు భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో సాదాసీదాగా ఉంటారని, ఆమె సింప్లిసిటీ, నిస్వార్థ స్వభావం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు చేతులు కలుపుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

మమత చాలా తెలివైన నాయకురాలని పేర్కొన్న హార్దిక్, ఆమె విప్లవాత్మక నాయకురాలని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీల నేతగా ఆమె ముందుకు రావాల్సిన అవసరం ఉందనేది తన అభిప్రాయమని హార్దిక్ వివరించారు. ఇక, హార్దిక్ పటేల్‌ను మమతా బెనర్జీ తన చిన్న తమ్ముడని అభివర్ణించారు.

More Telugu News