REHAM KHAN: పాకిస్థాన్ ను వదిలి వెళ్లిపోయిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య!

  • రెహం ఖాన్ కు బెదిరింపు కాల్స్
  • కుమార్తెను తీసుకుని.. దేశం విడిచి వెళ్లిన ఇమ్రాన్ రెండో భార్య
  • త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తానని ప్రకటన

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ ఆ దేశాన్ని వీడి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం ఆమె పాక్ నుంచి వెళ్లిపోయారని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ వెల్లడించింది. ఫోన్ల ద్వారా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె దేశాన్ని వీడారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనకు ఎవరి నుంచి కానీ, ఏ రాజకీయ పార్టీ నుంచి కూడా సపోర్ట్ దొరకలేదని... ఈ నేపథ్యంలో పాఠశాల విద్యను చదువుతున్న తన కుమార్తెను తీసుకుని, వెళ్లిపోతున్నానని ఆమె తెలిపారు. అయితే, తనకు బెదిరింపు కాల్స్ ను ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు.

శనివారంనాడు ఇస్లామాబాద్ నుంచి 'ఇండియా టీవీ'తో ఆమె మాట్లాడుతూ, బుస్రా మనేకాతో ఇమ్రాన్ ఖాన్ మూడో వివాహం సంగతి తనకు తెలుసని చెప్పారు. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇమ్రాన్ ఆ విషయాన్ని అధికారికంగా బహిర్గతం చేయడం లేదని అన్నారు. ఈ విషయాన్ని వెల్లడించడంలో ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని, లేదా మూడో పెళ్లి గురించి బయటకు చెప్పడానికి ఇది సరైన సమయం కాదని ఆయన భావిస్తుండవచ్చని తెలిపారు. పలు విషయాలపై ఇప్పటిదాకా తాను మౌనంగానే ఉన్నానని... త్వరలోనే అన్ని విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు. తొలుత ఓ టీవీ ఛానల్ లో యాంకర్ గా ఉన్న రెహం ఖాన్... ఇమ్రాన్ ను పెళ్లాడి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే, ఆమె పోటీ చేయకుండా ఇమ్రాన్ అడ్డుకున్నారు. దీంతో, వీరి మధ్య అగాధం పెరిగి, చివరకు విడాకులతో ముగిసింది.

More Telugu News