kalva srinivasulu: మా నిరసనలు తెలియజేస్తాం: బ‌డ్జెట్‌పై మ‌ంత్రి కాల్వ శ్రీనివాసులు

  • కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఆశించిన కేటాయింపులు జరగలేదు
  • కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం
  • రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడతాం
  • బాధ్యతాయుతమైన ప్రభుత్వ నేతగా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఆశించిన కేటాయింపులు జరగలేదని ఏపీ సమాచార శాఖ మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో రాష్ట్ర రెవెన్యూ లోటు, నూతన రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ అంశాల ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారందరూ అసహనానికి గురయ్యారని, కొందరు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేశారని చెప్పారు.

బాధ్యతాయుతమైన ప్రభుత్వ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశారని, కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా భవిష్యత్ కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. బీజేపీ మిత్రపక్షమైనా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడతామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. బడుగు, బలహీన వర్గాల వేదికగా తమ పార్టీ అవతరించిందని, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ తమ ఆలోచనలు, నిరసనలు తెలియజేస్తామ‌ని, రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు.

బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో అడగవలసి ఉందని అన్నారు. బడ్జెట్ లోని అన్ని అంశాలను అద్యయనం చేస్తున్నామని, టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తున్నారని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఫలితాలు సాధించేవరకు పోరాడతామని చెప్పారు. విభజన హామీలు నెరవేర్చే విషయంలో అన్ని పార్టీలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడే న్యాయం జరగాలన్నారు. పార్లమెంటుని వేదిక చేసుకొని తమ పార్టీ ఎంపీలు తమ వాదన వినిపిస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో చెప్పింది చేయమని అడుగుతున్నట్లు తెలిపారు. కొన్ని కార్యక్రమాలకు కేంద్ర ప్ర‌భుత్వం సాయం చేస్తోంద‌ని, ఆ విషయం తాము చెబుతూనే ఉన్నామన్నారు. కేంద్రం సహకరిస్తే రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

More Telugu News