Tamilnadu: పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన తమిళ హీరోయిన్ శ్రుతి... సెంట్రల్ జైల్లో!

  • ధనవంతులైన యువకులే టార్గెట్
  • తన అందంతో ముగ్గులోకి దింపే హీరోయిన్ శ్రుతి
  • మూడేళ్ల క్రితమే తనను మోసం చేసిందన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్
  • కొత్త ఆరోపణల పత్రాన్ని కోర్టుకు అందించిన పోలీసులు

పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ, పలువురిని మోసం చేయడమే పనిగా పెట్టుకుని కోట్లకు పడగలెత్తిన తమిళ నటి శ్రుతిపై మరింత మంది కేసులు పెట్టారు. పాపనాయకన్ పాళయం పరిధిలోని ధనలక్ష్మీ నగర్ కు చెందిన 21 ఏళ్ల శ్రుతి గతంలో కొన్ని సినిమాల్లో పనిచేసింది. విదేశీ యువకులతో పరిచయం పెంచుకుని, తన అందంతో వారిని ప్రేమలోకి దింపి, ఆపై వారిని వివాహం చేసుకుంటానని నమ్మించి లక్షల కొద్దీ డబ్బు వసూలు చేసి తప్పించుకు తిరుగుతుండేది.

ఆమెను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయగా, మూడేళ్ల క్రితమే తనను మోసం చేసి రూ. 40 లక్షలకు పైగా తీసుకుందని, పరువుపోతుందని అప్పట్లో ఫిర్యాదు చేయలేదని బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు శ్రుతికి వెళ్లినట్టుగా సాక్ష్యాలు ఉండటంతో కోయంబత్తూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

ఆమెను విచారణ నిమిత్తం కోయంబత్తూరు కోర్టుకు తీసుకురాగా, తాజా కేసులో ఆరోపణల పత్రాలను కోర్టుకు అందించారు. శ్రుతి బారిన పడిన వారు ఇంకా చాలా మంది ఉండివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విచారణ అనంతరం ఆమెను తిరిగి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

More Telugu News