Venkaiah Naidu: మాతృభాష పరిరక్షణకు మాతృమూర్తులందరూ నడుం బిగించాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి దంపతులను కలిసిన ఏపీ మహిళా కమిషన్ సభ్యులు
  • మాతృభాష కళ్ళు అయితే, ఆంగ్లభాష కళ్ళద్దాల లాంటిది
  • స్వయం ఉపాధితో మహిళల్లో ఆత్మవిశ్వాసం
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మాతృభాష పరిరక్షణకు మాతృమూర్తులందరూ నడుం బిగించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపు నిచ్చారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ రోజు తనను కలిసిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యులతో వెంకయ్యనాయుడు, ఆయన సతీమణి ఉషా నాయుడు ముచ్చటించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మాతృభాషను అందరూ ప్రోత్సహించాలని, తప్పనిసరిగా ప్రతివారు తమ సంతానానికి మాతృభాషను నేర్పాలని అన్నారు. ఆంగ్లభాషకు తాను వ్యతిరేకం కాదని, కాని మాతృభాష నేర్చుకున్న తర్వాతనే ఇతర భాషలను నేర్చుకోవాలని సూచించారు. మాతృభాష కళ్ళు వంటిదైతే, ఆంగ్లభాష కళ్ళద్దాలవంటిదంటూ తన దైన శైలిలో ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదవ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయడం హర్షణీయమని ప్రశంసించారు.
 
మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే అత్యుత్తమమైందని, ఆది కాలం నుండి వేదకాలం నుండి పుణ్యకాలం నుండి పురాణకాలం నుండి మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పురాణాలలో మహిళలకు ఎంతో గుర్తింపు ఇచ్చారని, మన దేశంలోని నదుల పేర్లు కూడా మహిళల పేర్లపైనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మనమందరమూ మహిళలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ముందుకు పంపితే వారు సాధించలేనిది ఏదీ లేదని, మహిళా రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని, కేవలం రిజర్వేషన్లు కల్పించినంత మాత్రాన సమస్య సమసిపోదని అభిప్రాయపడ్డారు.

ప్రతి ఒక్కరు మహిళలకు అవకాశాలు కల్పించడం, వారిని ప్రోత్సహించే విషయంలో చిత్తశుద్ధి పాటించాలని, అందుకు, చట్టసభల్లో బిల్లుతో పాటు రాజకీయంగా, పరిపాలనా పరమైన చిత్తశుద్ధి కావాలని అన్నారు. దేశ ప్రగతికి చదువు చాలా అవసరమని, ప్రతి బాలిక తప్పనిసరిగా చదువుకోవాలని, అదే మనల్ని ముందుకు తీసుకుపోతుందని, మహిళలందరూ వారి పిల్లలకు ఉత్తమమైన విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. అలాగే మహిళలకు ఆర్థిక స్వావలంబన చాలా అవసరమని, వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని,. ఇలా జరిగినప్పుడు మహిళలు స్వశక్తితో వారికాళ్ళపై వారు నిలబడగలుగుతారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ మహిళలకు, బాలికలకు కుట్టుపని, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి చిన్న పనులు నేర్పించడం, కౌశల్య శిక్షణ ద్వారా వారికి స్వయం ఉపాధి లభిస్తోందని, స్వావలంబన లక్ష్యంగా మహిళలు శిక్షణ పొందుతున్నారని దీనికి ఉదాహరణగా చెప్పారు. మహిళలకు వివిధ రంగాలలో బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు ఇప్పించడంతో వారు తమ సొంతంగా పనులు చేసుకుని సంపాదించడం ద్వారా పురుషులకు చేయూతగా నిలబడుతున్నారని అన్నారు.
 వెంకయ్యనాయుడు చేసిన సూచనలు ఎంతో ఉత్తేజపరిచాయి: నన్నపనేని రాజకుమారి
 
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు తమతో సంభాషించడం చాలా సంతోషంగా ఉందని, వారు చేసిన సూచనలు, సలహాలు తమనెంతో ఉత్తేజపరిచాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఉపరాష్ట్రపతి, ఆయన సతీమణి తమ విలువైన సమయాన్ని కేటాయించి తమతో గడిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సలహాలను మహిళలందరూ తప్పనిసరిగా పాటించి మహిళా స్వావలంబన కోసం కృషి చేస్తామని అన్నారు.

More Telugu News