director ajay kaundinya: ఎమ్మెల్యే రోజాతో 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' పార్ట్ 2 తీస్తా: దర్శకుడు అజయ్ కౌండిన్య సంచలన వ్యాఖ్యలు

  • జీఎస్టీ సినిమాను రోజాను పెట్టి తీసుండాల్సింది
  • రోజా ఒప్పుకుంటే పార్ట్ 2 తీస్తా
  • సినీరంగ సమస్యలపై పవన్ ప్రశ్నించాలి

టాలీవుడ్ దర్శకుడు అజయ్ కౌండిన్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒప్పుకుంటే... ఆమెను పెట్టి 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా తీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తెరకెక్కించిన 'బూత్ బంగ్లా'కు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గతంలో లో తాను తీసిన సినిమాలు థియేటర్లు దొరకక, విడుదలకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తాను నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడుతానని చెప్పారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రోజా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గాయత్రి గుప్తాల గురించి మాట్లాడతానని చెప్పాడు.

సీనియర్ నటి అయిన ఎమ్మెల్యే రోజాకు పాదాభివందనమని కౌండిన్య అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడే రోజా... సినిమా పరిశ్రమలోని సమస్యల గురించి మాత్రం మాట్లాడదని మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు, టెక్నీషియన్లు ఇలా ఎందరో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా ఆమె ఏమీ చేయడం లేదని విమర్శించాడు. రామ్ గోపాల్ వర్మ విదేశీ నటిని పెట్టి సినిమా తీశారని... రోజాను పెట్టి తీసుంటే బాగుండేదని అన్నాడు. రోజా ఒప్పుకుంటే ఆమెను పెట్టి 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2' సినిమా తీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సినీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేస్తుంటే... సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉన్నారని అజయ్ మండిపడ్డారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వానికి సినీరంగం రూ. 600 కోట్ల ట్యాక్స్ కట్టిందని... కానీ, కేసీఆర్ అనౌన్స్ చేసిన ఏ ఒక్క పనీ అమలుకు నోచుకోలేదని అన్నాడు. ఈ సమస్యను తలసాని దృష్టికి తీసుకెళితే... యూసుఫ్ గూడ చెక్ పోస్టు వద్ద ఉన్న చిన్న శ్రీశైలంయాదవ్ ను కలవమని తమకు సలహా ఇచ్చాడని... మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతాడా? అని ప్రశ్నించాడు.

పవన్ కల్యాణ్ పై కూడా కౌండిన్య మండిపడ్డాడు. ఎన్నో సమస్యలపై ప్రశ్నించే పవన్... సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించరా? అని నిలదీశారు. కేసీఆర్ కు క్షమాపణలు చెప్పుకోవడానికే ఆయన ఇంటికి పవన్ వెళ్లారని చెప్పాడు.

ఒక ఆడ, మగా తేడా తెలియని ఓ అమ్మాయి గురించి మాట్లాడతానని... ఆమె గాయత్రి గుప్తా అని కౌండిన్య తెలిపారు. సినీపరిశ్రమలో అమ్మాయిలను నిర్మాత, దర్శకులు వాడుకుంటారని ఆమె ఓ టీవీలో మాట్లాడుతూ చెప్పిందని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో జరిగేది ఏందో తెలిసి కూడా ఇలాంటి విషయాలు మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

More Telugu News