'ఆ దర్శకుడిని చంపండి.. వెంటనే వచ్చి 51 లక్షలు పట్టుకెళ్లండి'.. అంటూ క్షత్రియ రాజ్‌పుత్‌ మహాసభ ప్రకటన

  • దీపికా పదుకునే చెవులు, ముక్కు కోస్తే రూ.కోటి న‌జ‌రానా అంటూ నిన్న కూడా ఓ ప్రకటన 
  • తమ ఆందోళనను పట్టించుకోని రాజకీయవేత్తలకు తగిన గుణపాఠం  చెప్పాలని పిలుపు
  • రాజ్‌పుత్‌లు చిన్న పిల్లలపై దాడి చేయరు: దివాకర్ సింగ్
సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'పద్మావత్' సినిమా విడుదలయిన నేప‌థ్యంలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఆందోళ‌న‌లు చెల‌రేగుతోన్న విష‌యం తెలిసిందే. నిన్న క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్.. 'పద్మావ‌త్‌'లో నటించిన దీపికా పదుకునే చెవులు, ముక్కు కోసిన వారికి త‌మ‌ కమ్యూనిటీ త‌ర‌ఫున రూ.కోటి న‌జ‌రానా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా  ఆల్‌ ఇండియా బ్రజ్‌మండల్‌ క్షత్రియ రాజ్‌పుత్‌ మహాసభ మరో ఆఫర్ ప్రకటించింది. భన్సాలీ తల నరికిన వారికి రూ.51 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటన చేసి కలకలం రేపింది.

సదరు దర్శకుడిని హత్య చేస్తే వెంటనే ఆ డబ్బు అందుకోవచ్చని బ్రజ్‌మండల్‌ క్షత్రియ రాజ్‌పుత్‌ మహాసభ ఉపాధ్యక్షుడు దివాకర్ సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాగే తమ ఆందోళనను పట్టించుకోని రాజకీయవేత్తలకు తగిన గుణపాఠం  చెప్పాలని అన్నారు. రాజపుత్‌లు నిరాయుధులు, మహిళలు, పిల్లలపై ఎప్పటికీ దాడి చేయరని, ఇటీవల గుర్గావ్‌లో చిన్న పిల్లల బస్సు అద్దాలని ధ్వంసం చేసింది తమ వారు కాదని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Padmaavat
Deepika Padukone
bhansali

More Telugu News