Haryana: కనిపించకుండా పోయిన హర్యానా గాయని... పొలాల మధ్య మృతదేహం!

  • హర్యానా సీఎం ఖట్టర్ స్వగ్రామం సమీపంలో మృతదేహం
  • ఆదివారం నాడు కచేరీ నిమిత్తం వెళ్లిన మమతా శర్మ
  • ఆపై కనిపించకుండా పోయిన గాయని
  • వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదన్న కుటుంబీకులు

కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన హర్యానా గాయని మమతా శర్మ, రోహ్ తక్ జిల్లాలోని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వగ్రామం బనియానీ సమీపంలో మృతదేహమై కనిపించడం తీవ్ర కలకలాన్ని రేపింది. గడచిన ఆదివారం నాడు తన స్నేహితుడు మోహిత్ కుమార్ తో ఓ పాట కచేరిలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె, ఆపై ఇంటికి రాలేదు. ఆమె మృతదేహం గ్రామ సమీపంలోని పొలాల్లో నిన్న మధ్యాహ్నం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మోహిత్ తో కలసి సోనిపట్ జిల్లాలోని గోహనా పట్టణంలో ప్రదర్శనకు ఆమె వెళ్లగా, ఆపై 10.30 గంటల సమయంలో మోహిత్, మమత కుటుంబీకులకు కాల్ చేసి, ఆమె మరి కొందరితో కలసి ఇంకో కారులో వెళ్లిందని చెప్పాడు. వారు తనకు తెలుసునని, ఈవెంట్ వద్ద కలుస్తానని ఆమె చెప్పిందని, కానీ ఆమె అక్కడికి రాలేదని సమాచారం ఇచ్చాడు.

వెంటనే ఆమె సెల్ ఫోన్ కు రింగ్ ఇస్తే, ఫోన్ రింగ్ అయినా ఎవరూ ఎత్తలేదు. ఆపై సోమవారం ఉదయానికి స్విచ్చాఫ్ వచ్చింది. ఆ వెంటనే మమత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు కారులో ఎవరు వెళ్లారన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసులు చెబుతుండగా, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించక పోవడంతోనే ఇంత ఘోరం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

More Telugu News