vangaveeti radha: విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం... వైకాపాకు షాకిస్తూ టీడీపీలోకి వంగవీటి రాధ!

  • త్వరలోనే పార్టీ మారనున్న కీలక నేత
  • చర్చలు జరిగాయంటున్న అధికార పార్టీ నేతలు
  • 'విజయవాడ సెంట్రల్'ను కోరిన వైకాపా నేత

విజయవాడలో మరో రాజకీయ సంచలనం ఇది. అనునిత్యమూ వైఎస్ జగన్ వెంటే నడుస్తానని చెప్పే వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించనున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం ఈ ఉదయం వార్తల్లోకి ఎక్కగా, ఇప్పుడు ఎక్కడ చూసినా వంగవీటి రాధ పార్టీ మార్పుపైనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రాధ నోటి నుంచి అధికారికంగా ఏ విషయమూ బయటకు రానప్పటికీ, అటు తెలుగుదేశం వర్గాలు, ఇటు రాధ అనుచరులు పార్టీ మార్పు ఖాయమంటున్నారు. రాధతో చర్చలు పూర్తయ్యాయని కొందరు టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు.

 తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు రాధ సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై తమతో చర్చించారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. కాగా, గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉంటున్న వంగవీటి రాధ, పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తన అనుచరుల వద్ద చాలాసార్లే ప్రస్తావించారట రాధ. వంగవీటి రాధ టీడీపీలో చేరితే, అది వైకాపాకు కోలుకోలేని దెబ్బే.

More Telugu News