supreme court: చీఫ్ జస్టిస్ ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ఆ నలుగురు న్యాయమూర్తులూ లేరు!

  • రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు జడ్జిలకు దక్కని చోటు
  • కీలక కేసులను విచారించనున్న ధర్మాసనం
  • కొనసాగుతున్న సుప్రీంకోర్టు వివాదం

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ కు, నలుగురు సీనియర్ జడ్జిలకు మధ్య తలెత్తిన వివాదం సమసిపోయిందనే వార్తలు వచ్చినప్పటికీ... అందులో వాస్తవం లేదని అర్థమవుతోంది. అత్యంత కీలకమైన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిన్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పక్కనబెట్టారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. సుప్రీంకోర్టు వివాదం ఇంకా సమసిపోలేదని ఆయన అన్నారు.

గతవారం నలుగురు జడ్జిలు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీలక కేసులను విచారించేందుకు బెంచ్ ఏర్పాటు విషయంలో చీఫ్ జస్టిస్ సరైన రీతిలో వ్యవహరించడం లేదని వారు ఆరోపించారు. సుప్రీంకోర్టును దేశ ప్రజలే కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, నిన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని చీఫ్ జస్టిస్ ప్రకటించారు. ఈ బెంచ్ లో చీఫ్ జస్టిస్ తో పాటు జస్టిస్ ఏకే శిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ లు ఉన్నారు. నిరసన వ్యక్తం చేసిన నలుగురు జడ్జిలకు బెంచ్ లో చోటు లేకపోవడం... ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

నిన్న ప్రకటించిన రాజ్యాంగ ధర్మాసనం అత్యంత కీలకమైన కేసులను విచారించనుంది. ఆధార్, హోమో సెక్సువాలిటిపై నిషేధం ఎత్తివేత, శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశం తదితర కేసులపై విచారణ చేపట్టబోతోంది.

More Telugu News