Sankranthi: సినిమాకు వెళ్లిన మూడు కుటుంబాలు... వచ్చేలోగా గుల్ల చేసిన చోరులు!

  • రెచ్చిపోయిన చోరాగ్రేసరులు
  • రాజేంద్రనగర్ లో ఐదు ఇళ్లలో దోపిడీ
  • సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్న పోలీసులు

ఓ వైపు సంక్రాంతి పర్వదినాలను సొంత ఊరిలో జరుపుకోవాలన్న కోరికతో ఇళ్లకు తాళాలు పెట్టి వెళ్లిన వారు, మరోవైపు పండగ నాడు సినిమాలకు, షికార్లకు వెళ్లాలని భావించి తాత్కాలికంగా తాళం వేసి వెళ్లేవారు... ఇంతకన్నా చోరాగ్రేసరులకు కావాల్సింది ఏముంటుంది? రెచ్చిపోయారంతే. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ సాయిబాబా కాలనీలో ఏకంగా ఐదు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి.

రెండు కుటుంబాలు పండగ నిమిత్తం ఊరికి వెళ్లగా, మిగతా మూడు కుటుంబాలూ సినిమాకు వెళ్లాయి. సినిమా నుంచి తిరిగి వచ్చే సరికి ఆ ఇళ్లలో దొంగతనాలను పూర్తి చేసుకున్న దొంగలు దర్జాగా వెళ్లిపోయారు. తాళాలను పగులగొట్టి 40 తులాల బంగారాన్ని, దొరికినంత నగదును అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం అందుబాటులోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

More Telugu News