kathi mahesh: అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా వెళ్లినట్టే!: బాలకృష్ణ 'జై సింహా'పై కత్తి మహేష్ రివ్యూ

  • కథకు గతి, గమనం లేవు 
  • బాలయ్యకు తగ్గ హీరోయిజం, బలం కథలో లేవు 
  • ముగ్గురు హీరోయిన్లు ఉండీ వేస్టే

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం 'జై సింహా' నేడు భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాపై ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మూడు ముక్కల్లో సింపుల్ రివ్యూ ఇచ్చారు. 1980ల నాటి కథకి 1990ల నాటి కథనం ఈ సినిమా అని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినిమా కథకు గతి లేదని, గమనం లేని కథనంతో కొనసాగిందని చెప్పారు. మొత్తంమ్మీద ఈ సినిమా ఒక కలగూరగంప అని విమర్శించారు. నిరర్థకమైన కథలో అసంబద్ధమైన పాత్రలో బాలయ్య కనిపించారని చెప్పారు. ముగ్గురు హీరోయిన్లు ఎందుకు ఉన్నారో కూడా తెలియదని చెప్పారు. మరో సంక్రాంతి సినిమా 'అజ్ఞాతం'లోకి వెళ్లిపోయిందని ట్వీట్ చేశారు.




మరోవైపు ఓ యూట్యూబ్ ఛానల్ తో కత్తి మహేష్ మాట్లాడుతూ, సంక్రాంతికి వచ్చిన మరో చిత్రం 'జై సింహా' సినిమా కలగూరగంపగా ఉందని చెప్పారు. ఫస్ట్ హాఫ్ లో కథ ఎటు వెళ్తోందో అనే సందేహంలో మనం ఉంటామని అన్నారు. చివరి పది, పదిహేను నిమిషాల్లో అది బాలయ్యకు సంబంధించిన సెంటిమెంట్ కథ అని మనకు అనిపిస్తుందని చెప్పారు. ఈ కథలో క్లారిటీ లేదని... గతంలో బాలయ్య చేసిన సినిమాలకు విరుద్ధంగా ఈ కథ ఉందని... బాలయ్య అభిమానులను కూడా నిరాశపరిచే విధంగా ఉందని అన్నారు. 

కథలో బాలయ్య ఉంటారే తప్ప, బాలయ్య వల్ల కథ నడవదని మహేష్ చెప్పారు. బాలయ్యకు తగ్గ హీరోయిజం, బలం ఆ పాత్రలో లేవని అన్నారు. ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయని చెప్పారు. ముగ్గురు హీరోయిన్లలో నయనతార పాత్ర కొంచెం బాగానే ఉన్నప్పటికీ, మిగిలిన వారికి అంత స్కోప్ లేదని తెలిపారు.

బ్రహ్మానందంలాంటి కమెడియన్లు ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండలేదని, సెకండ్ హాఫ్ లో కామెడీనే లేదని చెప్పారు.  భట్ సంగీతం రెండు పాటల్లో మాత్రమే బాగుందని అన్నారు. కథ, కథనం బాగోలేకపోవడంతో కేయస్ రవికుమార్ దర్శకత్వ ప్రతిభ మరుగున పడిపోయిందని చెప్పారు. 

More Telugu News